- టెస్టు చేయండని అడిగితే చేయించుకొని రమ్మన్నరు
- అంబులెన్స్లోనే గంటసేపు ఎదురుచూపు
- కొడుకు కండ్ల ముందే కొట్టుమిట్టాడి మరణించిన తల్లి
హైదరాబాద్, వెలుగు: ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఓ మహిళను కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ లేదని గాంధీ హాస్పిటల్ స్టాఫ్ అడ్మిట్ చేసుకోలేదు. టెస్టు చేయాలని కోరినా వినిపించుకోలేదు. హాస్పిటల్ ఆవరణలోనే గంటసేపు ఎదురుచూసినా కనికరించలేదు. చివరకు అంబులెన్స్లోనే ఆ మహిళ మరణించింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్లో జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్ ప్రాంతానికి చెందిన జయమ్మ (48) అనే మహిళకు గత మంగళవారం జ్వరం వచ్చింది. ఆమె కొడుకు శామీర్పేట్ పీహెచ్సీలో కరోనా టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే ఉండి మెడిసిన్ వాడాలని స్టాఫ్ సూచించారు. ‘శామీర్పేట్లో డాక్టర్లు చెప్పినట్టు ఇంట్లోనే ఉండి వాళ్లు ఇచ్చిన మెడిసిన్ వాడినం. ఆదివారం పొద్దున మా అమ్మకు దమ్ము రావడం స్టార్టయింది. లోతుకుంటలోని ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తే బెడ్లు లేవన్నరు. అప్పటికే అమ్మ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతోంది. అంబులెన్స్ కోసం 108 నంబర్కు ఫోన్ చేస్తే పట్టించుకోలే. ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని దమ్మాయిగూడలో ఇంకో ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లినం. అక్కడక కూడా అడ్మిషన్ దొరక్కపోవడంతో గాంధీకి తీసుకెళ్లిన. అక్కడి స్టాఫ్ పాజిటివ్ సర్టిఫికెట్ చూపించాలన్నారు. శామీర్పేట్లో మాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఫోన్కు మెసేజ్ రాలేదు. విషయం వాళ్లకు చెప్తే సర్టిఫికెట్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామన్నారు. టెస్ట్ చేయమని కోరితే వెళ్లి చేయించుకుని రమ్మన్నరు. గంటసేపు అక్కడే అందరినీ బతిమాలినా పట్టించుకోలేదు. అమ్మ ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే తట్టుకోలేకపోయా. అదే అంబులెన్స్లో అక్కడి నుంచి బయటకు బయల్దేరాం. మధ్యలోనే అమ్మ చనిపోయింది’ అని ‘వెలుగు’కు జయమ్మ కొడుకు ప్రదీప్ చెప్పారు.
ఆపతిలో వస్తే పేషెంట్ను చూడాలె గాని పేపర్లు చూస్తరా?: మహిళ కొడుకు
అంబులెన్స్లో తన తల్లి ఊపిరి అందక కొట్టుమిట్టాడుతుంటే ఏ డాక్టరూ వచ్చి చూడలేదని ప్రదీప్ ఆవేదన చెందారు. ‘ఆపతిలో హాస్పిటల్కు పోతే పేషెంట్ను చూడాలి గాని, పేపర్లను చూస్తారా’ అని ప్రశ్నించారు. కండ్ల ముందే తల్లి చనిపోతున్నా ఏం చేయలేకపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై గాంధీ నోడల్ ఆఫీసర్ ప్రభాకర్రావును వివరణ కోరగా ఆ విషయం అసలు తన దృష్టికి రాలేదన్నారు. పేషెంట్ కండీషన్ క్రిటికల్గా ఉంటే పాజిటివ్ సర్టిఫికెట్ లేకున్నా అడ్మిట్ చేసుకుంటున్నామని చెప్పారు.